అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతున్నందున పండుగ ఎప్పుడు జరుపుకోవాలో జనమంతా ఓ వైపు తర్జన భర్జన పడుతూనే దీపావళి షాపింగ్ చేసేస్తున్నారు.
మంగళవారం సికింద్రాబాద్లో పూజల కోసం అమ్మవారి ప్రతిమలను కొనుగోలు చేస్తున్న ఓ నగరవాసి
సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): దీపావళి వచ్చింది.. ఆఫర్లను మోసుకు వచ్చింది. దీంతో మార్కెట్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని సంస్థలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా షాపింగ్మాల్స్, స్వీట్స్ దుకాణాలు, వాహన షోరూంలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు దీపావళి దమాకా అంటూ ప్రచారం ముమ్మరం చేశాయి. దీంతో అమ్మకాల జోరు ఊపందుకున్నది.
పెరిగిన వాహన కొనుగోళ్లు..
గతేడాది దసరా, దీపావళి పండుగల సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 12,275 వాహనాల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ 12వ తేదీ వరకు మొత్తం 19,726 అమ్మకాలు జరిగాయి. అయితే గత ఏడాదికంటే ఈ ఏడాది 7,451 అధికంగా విక్రయించినట్లు పలు కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
మిఠాయితో పోటీపడుతున్న సేమ్యా..
దీపావళి వచ్చిందంటే చాలు.. మిఠాయిలతో పోటీపడి సేమ్యా అమ్మకాలు జరుగుతుంటాయని బేగంబజార్లోని అమ్మకందారులు పేర్కొన్నారు. కిలోకు రూ.110 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా డ్రైఫ్రూట్స్ కేజీకి రూ.400 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతుంది. బేగంబజార్ నుంచి జిల్లాలతో పాటు పక్క రాష్ర్టాలకు సైతం ఇక్కడినుంచే సరఫరా అవుతున్నాయి.
రెట్టింపైన మొబైల్ ఫోన్ల అమ్మకాలు
సాధారణ రోజుల కంటే.. పండుగల సీజల్లో 10శాతం ధరలు తగ్గించి ఇస్తుండటంతో మొబైల్ ఫోన్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం దీపావళి సందర్భంగా పెద్ద మొత్తంలో ఆఫర్లు ప్రకటించాయి. ప్లాట్కు ఎలక్ట్రికల్ స్కూటీ, గోల్డ్ కయిన్, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇలా అనేక ఆఫర్లు ప్రకటించడంతో ప్లాట్ల విక్రయాలు ఊపందుకున్నాయని వ్యాపారులు తెలిపారు.