సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే మార్గంలో పలు అధ్యయనాల తర్వాత ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ప్రయాణం సాఫీగా సాగేందుకు పలు సూచనలు జారీ చేసి, చర్యలు తీసుకున్నట్లుగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సైబరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ నేరుగా రోడ్డు నం. 45లో చేరడంతో తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. రోడ్ నం. 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు ఉన్న 2.7 కి.మీ. దూరాన్ని చేరడానికి 10 నిమిషాలు చాలని, కానీ భారీగా పెరిగిన ట్రాఫిక్ రద్దీతో 25 నిమిషాలకు పైగా సమయం పడుతున్నదని వివరించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ను నియంత్రించి రవాణా మెరుగుపరచడమే లక్ష్యంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లుగా వివరించారు.