మేడ్చల్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్లో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాల్లో గురువారం జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన సదస్సులో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లలో త్వరలో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ రానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్ టీకాలు వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు.
ఇబ్బందులుంటే తెలుపాలి : కలెక్టర్
రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాను స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రథమ స్థానంలో ఉండేలా అందరూ కృషి చేయాలని కలెక్టర్ హరీశ్ కోరారు. అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాల్లో అధికారుల, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్, ఆర్డీవో మల్లయ్య, కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, తాసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమం, అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం : మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్2 : పేదల సంక్షేమం, అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు బాల్రెడ్డి నగర్కు చెందిన రాంబాబుకు రూ.లక్ష 50 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం మంత్రి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంపనబోలు హరిగౌడ్, నాయకులు మోర నరహరిరెడ్డి, పాల్గొన్నారు.