మెదక్ రూరల్ : ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో బర్డ్ వాక్ ( Bird walk ) కార్యక్రమం నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేష్( Nagesh ) తెలిపారు. శనివారం పోచారంలోని డీబీసీలో నిర్వహించిన బర్డ్ వాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
పోచారం ల్యాండ్స్కేప్లో గొప్ప పక్షి వైవిధ్యం, సహజ వారసత్వం ఉందని దీనిని కాపాడేందుకు బర్డ్ వాక్ నిర్వహించామన్నారు. పోచారం జలాశయం , అభయారణ్యం చుట్టూ ఉన్న పోచారం ప్రాంతం, వలస నీటి పక్షులు, కొంగలు, ఐబీస్లు, బాతులు అనేక అటవీ ప్రాంతాలతో సహా విభిన్న పక్షి జీవనానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఇది ఒక ముఖ్యమైన పక్షి వీక్షణ గమ్యస్థానంగా నిలుస్తుందనీ పేర్కొన్నారు. ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, అధికారులు పాల్గొని వివిధ రకాల పక్షులను వీక్షించాలని కోరారు.
పక్షుల జీవన విధానం, వలస పక్షుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్రను వివరించాలని సూచించారు. పక్షుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లు నాటాలని, నీటి వనరులను కాపాడాలని, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ జోజి , మెదక్ డీపీఆర్వో రామచంద్ర రాజు, ఎఫ్ఆర్వోలు , బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.