తెలుగు యూనివర్సిటీ, జనవరి 2 : వృత్తిరీత్యా పిల్లలను విద్యతో తీర్చిదిద్దే ఉపాధ్యాయుడే అయినా ఆయనలో మానవతా దృక్పథం మాత్రం మెండుగా ఉంది. గోల్కొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బషీర్ రెడ్హిల్స్లోని ఎంఎన్జె క్యాన్సర్ దవాఖాన వద్ద ప్రతి రోజు రాత్రి రోగులు, వారి సహాయకులకు సేవాభావంతో ఆహారం పంపిణీ చేస్తూ వారి మన్ననలు అందుకుంటున్నారు. ఇలా 3 వందల రోజులుగా నిత్యం పంపిణీ చేసి పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారు.
దవాఖానకు వచ్చే వారికి ఉదయం సమయంలో కొందరు దాతలు అల్పాహారం పంపిణీ చేస్తుండగా మధ్యాహ్నం ప్రభుత్వం అందిస్తున్న ఐదు రూపాయల భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. రాత్రి మాత్రం పలువురు డబ్బులు లేక పస్తులుంటున్నారని తెలుసుకొని ప్రతి రోజు రాత్రి బషీర్ రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. మూడు వందల రోజులుగా దవాఖాన వద్ద ఆహారం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తానని ఆయన తెలిపారు.