సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ) : ఆటో డ్రైవర్ల ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని సోమవారం పలు ఆటో సంఘాల యూనియన్ నేతలు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి కోరారు. బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ , టీఎస్పీటీఎంఎంల ఆధ్వర్యంలో మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం విషయంలో పునరాలోచన, బస్సుల సంఖ్య తగ్గించాలని, ఓలా, ఉబర్, రాపిడ్ బైక్ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలని, ఆటో డ్రైవర్ల ఉపాధిని కాపాడానికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఆటోలను వినియోగించాలని, కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు తదితర డిమాండ్లను ఆటో నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ముందు ఉంచారు. దీనిపై స్పందించిన మంత్రి త్వరలోనే ఆటో సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని ఆటో సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బీఎంఎస్ ఆటో యూనియన్ నేతలు రవిశంకర్ అల్లూరి, శ్రీనివాస్ ముదిరాజ్, ఎండీ హబీబ్, సంతోష్గౌడ్, ఈశం శంకర్ తదితరులు పాల్గొన్నారు.