సుల్తాన్బజార్, ఆగస్టు 17: సకలాంగులకంటే దివ్యాంగులు ఎంతో నిజాయితీగా, పట్టుదలతో పని చేస్తారని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ బుర్రా వెంకటేశం అన్నారు. నాం పల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కళాశాలలో గురువారం దివ్యాంగుల కోసం ట్రైన్(ట్రస్ట్ ఫర్ రిటైలర్ అండ్ రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), రైస్(రూరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫర్ ఎక్స్లెన్స్) హాజరీ గ్రూప్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులు, మహిళల జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంచి సమాజాన్ని నిర్మించడానికి అందరూ కలిసి పని చేయాలన్నారు.
శారీరక లోపాలు ఉన్న వారిని హేళన చేయకుండా.. వారికి సహకారం అందించాలన్నారు. తాను కలెక్టర్గా పని చేసిన జిల్లాలలో దివ్యాంగులకు ఉద్యోగాలు ఇచ్చామని, ఇతరుల కంటే వారు ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు. శారీరక లోపం లేని వారు అవినీతికి పాల్పడుతూ, సమాజం తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు, సంస్థలు దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో వారు ఆశించిన గమ్యాన్ని త్వరగా చేరుకుంటారని అన్నారు. ఈ విషయాన్ని ఎందరో ఉద్యోగులు రుజువు చేశారని చెప్పారు. సకలాంగుల కంటే దివ్యాంగులు ఎంతో చురుగ్గా ఆలోచిస్తారని, తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తారన్నారు.
వారి కి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం అందరి బాధ్యత అని ఆయన సూచించారు. ట్రైన్, రైజ్, హజారీ సంస్థలు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ జాబ్ మేళా లో దాదాపు వెయ్యి మందికి ఉపాధిని కల్పించడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ మేళాలో 18 ఏండ్లు నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ దివ్యాంగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ కమిషనర్ బి.శైలజ, అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ డా.వరలక్ష్మి, అధ్యాపకురాలు ఉదయశ్రీ, సురేశ్, అమరేందర్ గౌడ్, హెడ్ ప్రవీణ్, కళాశాల సిబ్బంది, ఎన్ఎస్ఎస్ యూనిట్ పాల్గొన్నారు.