కొండాపూర్, జనవరి 27: విభిన్న రకాల జంతువులు, పక్షులు, జలచరాలు ఒకే వేదికపై సందడి చేస్తూ జంతు ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచాయి. మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా శుక్రవారం హైటెక్స్, ది హైదరాబాద్ కెనైన్ క్లబ్ (హెచ్సీసీ)ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభమయిన ‘పెటెక్స్ ఇండియా -2023’లో విభిన్న రకాల జాతుల జంతువులు, పక్షులు, జలచరాలు సందడి చేశాయి.
దేశంతో పాటు విదేశాలకు చెందిన విభిన్న రకాల పెట్స్ ప్రదర్శనలో పాల్గొన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన జంతు ప్రేమికులు తమకిష్టమైన పెట్స్తో సరదగా గడుపుతూ సెల్ఫీలు తీసుకున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే పెటెక్స్ షోలో డాగ్స్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైకెన్ -23 హైదరాబాద్ 3వ ఇంటర్నేషనల్ డాగ్ షోలో 50 రకాల జాతులకు చెందిన 500ల డాగ్స్ షోలో పాల్గొని సందడి చేయగా, ఇండియన్ క్యాట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ క్యాట్ షోను నిర్వహించారు. ప్రదర్శనలో రూ. 2వేల నుంచి రూ. 50లక్షలు విలువ చేసే విభిన్న రకాల పెట్స్ అందుబాటులో ఉంచారు.