సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మరో సర్వేకు సన్నద్ధమైంది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43వేల నిర్మాణాలు ఉన్నాయని అంచనా వేసిన అధికారులు..ఈ మేరకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వే చేస్తున్నది. గతేడాది జులైలో ఈ జీఐఎస్ సర్వేను ప్రారంభించగా, అప్పట్లో ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే సంబంధిత ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండగా, మరో ఆరు నెలల సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వేకు రూ.22 కోట్ల మేర ఖర్చు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్న తరుణంలోనే మరో సర్వేకు సిద్ధమయ్యారు. లే అవుట్లో ఖాళీ స్థలాలు, పార్కులు, ఆట స్థలాలు, మున్సిపల్ మార్కెట్లు, మున్సిపల్ షాపులు, స్లాటర్ హౌస్లు, డంపింగ్ యార్డులు మొదలైన స్థిరాస్తులపై సర్వే చేసేందుకు డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) తెరపైకి తీసుకువచ్చి సర్వే జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ స్థిరాస్తుల సర్వే, డిజిటలీకరణ, జియో రిఫరెన్సింగ్ తదితరమైనవి చేయగల కన్సల్టెంట్ల సేవలను ఆహ్వానిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులకు ఎంపికయ్యే కన్సల్టెన్సీ జీపీఎస్ సర్వే కాకుండా అంగుళం వరకు కూడా కచ్చితమైన వివరాలందజేయగల డీజీపీఎస్( డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) సర్వే నిర్వహించనున్నారు.
గ్రేటర్లో మరో సర్వేకు జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. ఈ సారి బల్దియా ఆస్తులు, వాటి పరిరక్షణ లక్ష్యంగా సర్వే చేపట్టనున్నారు. ప్రయోగాత్మకంగా చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో వీటి సర్వే, డిజిటలైజేషన్, జియో రిఫరెన్సింగ్ల కోసం కన్సల్టెంట్ల నుంచి ఆర్ఎఫ్పీ టెండర్లు ఆహ్వానించారు. ఈ నాలుగు జోన్లలో దాదాపు 1400 స్థిరాస్తులున్నట్లు అంచనా. వీటి విస్తీర్ణం దాదాపు 575 ఎకరాలు, కచ్చితంగా ఎన్ని ఆస్తులు , ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో సర్వే ద్వారా తెలియనున్నది. సర్వేకు ఎంపికయ్యే కన్సల్టెన్సీ అంగుళం వరకు కచ్చితమైన వివరాలందజేసే డీజీపీఎస్ (డిఫరెన్సియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) సర్వే చేయాలి. అన్ని ఆస్తుల విస్తీర్ణం, సరిహద్దులు, పక్కనున్న భవనాలు, రోడ్లు తదితర వాటిని సర్వే చేయాలి. ఆస్తికి సంబంధించి ప్రతీ మూల రియల్ కో ఆర్డినేట్లు గుర్తిస్తూ అన్ని భవనాల ముందు పక్కల లోపల దృశ్యాలు కనిపించేలా ఫొటోలు తీయనున్నారు సదరు భవనం జీహెచ్ఎంసీ ఏ సర్కిల్లో ఉందో పేర్కొనడంతో పాటు సర్వే నంబరు, టౌన్ సర్వే నంబరు, డోర్ నంబరు, లొకాలిటీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లతో పాటు ఖాళీ ప్రదేశమా? భవనమా? భవనమైతే నాలుగు వైపులా సరిహద్దులు, ప్రహరీ ఉందా..లేదా? భవనమైతే ప్రస్తుత వినియోగం, బిల్డప్ ఏరియా, భవనం పేరు వంటి వివరాలు పొందుపర్చనున్నారు. కాగా, లే అవుట్ ఓపెన్ స్పేస్లైతే లే అవుట్ పేరు, నంబరు, లే అవుట్ మేరకు ఎంత ఓపెన్ స్పేస్ ఉండాలి.. ఎంత ఉంది.(చదరపు గజాల్లో), ఎంత మేర కబ్జా అయింది. కబ్జాలో జరిగిన నిర్మాణాల వంటి వివరాలు సైతం పొందుపర్చనున్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన స్థిరరాస్తులన్నింటికీ యూనిక్ ఐడీ నంబరు ఇస్తారు. ఇందుకుగాను తగినన్ని బృందాలను నియమించి.. ఈ బృందాలకు ఆయా అంశాల్లో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాలు సహకరిస్తాయి. అంగుళం కూడా తేడా రాకుండా వాటిని కనిపెట్టడంతో పాటు రియల్ టైమ్లోనూ వాటిని ఆన్లైన్ ద్వారా వీక్షించే సదుపాయం ఉండాలని, భవిష్యత్లో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఈ డేటా ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.
నిర్మాణ రంగ అనుమతులు వివాదస్పదం కాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణాలతో ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయగా, ఉప్పల్ సర్కిల్లో ప్రభుత్వ భూమిలో అనుమతులు మంజూరు చేసినట్లు గుర్తించిన కమిషనర్.. వెంటనే రద్దు చేయాలని కలెక్టర్కు లేఖ రాశారు. భవిష్యత్లో పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని కమిషనర్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నారు. ప్రతి ఆస్తికి సంబంధించిన విస్తీర్ణం, సరిహద్దులు, చుట్టుపక్కల ఉన్న భవనాలు, రోడ్లు, వాటర్, విద్యుత్, సీవరేజీ వంటి యుటిలిటీస్ లైన్లు డీజీపీఎస్ను ఉపయోగించి చేయాల్సి ఉంటుంది.