మాదన్నపేట, ఫిబ్రవరి 22: ఖైదీలతో ఎక్కువగా గడిపేది వార్డర్లు మాత్రమే, అందువల్లే వార్డర్లు మానసికంగా, శారీరకంగా బలంగా ఉండేందు కోసం శిక్షణ ఇస్తున్నామని జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా అన్నారు. గురువారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వార్డుర్లుగా ఎంపికైన 136 మందికి చంచల్గూడ జైలు ఆవరణలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల శాఖకు దేశంలో ఎంతో పేరు ఉన్నదన్నారు. అనంతరం నూతన వార్డర్లందరికీ శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ( అడ్మిన్ ) ఐజీ రాజేశ్, ఐజీ మురళీబాబు (వెల్ఫేర్), డీఐజీలు శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.