సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా పలు చోట్ల జీహెచ్ఎంసీ చేపడుతున్న జంక్షన్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన ఐదు నెలలుగా మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల బిల్లుల చెల్లింపులు లేక కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేక మధ్యలోనే చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎనిమిది ప్రాంతాల్లోని కూడళ్లలో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి.
ఉదయం, సాయంత్రం సమయాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటున్నది. నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తుండటంతో ఎండాకాలం నడిరోడ్డుపై జనం నరకం చూస్తున్నారు. దీనికి తోడు వీఐపీలు వచ్చి వెళ్లే సమయాల్లో మాత్రమే కనిపించే ట్రాఫిక్ సీఐలు, ఎస్ఐలు..వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఉండటం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ చొరవ తీసుకుని జంక్షన్ల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.