HMDA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ ఎట్టకేలకు ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న హెచ్ఎండీఏ వేల కోట్ల రూపాయలతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులను చేపట్టింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. దీనిపై నమస్తే తెలంగాణలో పలు కథనాలు వచ్చాయి.
వీటిపై స్పందించిన ఉన్నతాధికారులు ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను గుర్తించి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ బుద్వేల్లో 182 ఎకరాల్లో హెచ్ఎండీఏ చేపట్టిన లేఅవుట్లో అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.354 కోట్లు, అదేవిధంగా మోకిలలో చేపట్టిన లేఅవుట్లో మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ.47 కోట్లతో కలిపి రెండు టెండర్లను హెచ్ఎండీఏ ఆహ్వానించింది. ఎన్నికల కోడ్ మూలంగా నవంబర్, డిసెంబర్ నెలలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు నెలలు కలిపి దాదాపు 4 నెలల తరువాత టెండర్లు ఆహ్వానించడం శుభపరిణామం.