జియాగూడ, మే 16 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడలో రంగనాథస్వామి ఆలయం వద్ద స్వామి ఊరేగింపు కోసం నూతనంగా రూ. 25లక్షలతో తయారు చేసిన రథాన్ని మంత్రి శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎంతో చరిత్ర కలిగిన రంగనాథస్వామి ఆలయానికి ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం.. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతూ ఆలయ విశిష్టతను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటి పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. జూన్ 20న నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి లక్షలాది మంది భక్తులు రానున్నారని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ, ఆలయ పండితులు శేషాచార్యులు, బీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి నందకిశోర్ వ్యాస్, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆర్వీ మహేందర్ కుమార్, మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ, పరమేశ్వరిసింగ్, శేఖర్రెడ్డి, ఆల పురుషోత్తం రావు, ధన్రాజ్, శ్రీనివాస్ గుప్తా, కావూరి వెంకటేశ్, హెచ్ కుమార్, కోటి శైలేష్ కురుమ తదితరులు పాల్గొన్నారు.