సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాల్లో పార్కులు, పచ్చదనం పెంపకం, వాటి నిర్వహణలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రాష్ర్టానికి రోల్ మోడల్గా నిలుస్తున్నది. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించడం, అమలు చేయడంతో పాటు స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చేయూతనిస్తున్నది.
పచ్చదనం విషయంలో మంచి ఫలితాలను చూపుతున్న హెచ్ఎండీఏకు కోర్ సిటీలోని కొన్ని పార్కులను అభివృద్ధి చేసి, నిర్వహించే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్పేట రోడ్డు ల్యాండ్ స్కేపింగ్, బర్కత్పుర పార్కు అభివృద్ధి, రామకృష్ణనగర్ పార్కు, ఎంఎస్ఆర్ పార్కుల్లో ల్యాండ్ స్కేపింగ్ పనులు, నగర శివారులోని లక్డారం గ్రామ పంచాయతీ, జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో ల్యాండ్ స్కేపింగ్ పనులను చేపట్టనున్నారు. వీటి నిర్వహణకు మొత్తం రూ.1.76 కోట్ల నిధులను హెచ్ఎండీఏ వెచ్చించనున్నది.