చిక్కడపల్లి, మే 24: విముక్త సంచార, ఆర్థ సంచార జాతుల కులాల ప్రాతినిధ్యం.. ఆధునిక అభివృద్ధిలో ఒక్క శాతం కూడా లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణ మోహన్రావు అన్నారు. ఈ జాతులు సమున్నతంగా ఎదగాలని సమగ్రంగా అందజేసిన బాలకృష్ణ రేనకె కమిషన్ నివేదికను బుట్ట దాఖలు చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డీనోటిఫైడ్ ట్రైబ్స్ (విముక్త జాతులు), నోమాడిక్ ట్రైబ్స్ (సంచార జాతులు), సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (ఆర్థ సంచార జాతులు) కులాల మూడురోజుల జాతీయ సదస్సు ‘హైదరాబాద్ డిక్లరేషన్ 2023 పేరిట బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వకుళాభరణం హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాలు, సంచార జాతుల కులాలపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదని విమర్శించారు.
ఈ వర్గాలు విద్యా, ఉద్యోగ రంగాల్లో దేశంలో ఒక్క శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. జాతీయ స్థాయిలో ఈ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శినితకను ప్రదర్శించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణను సంక్షేమ రంగంలో రోల్మోడల్గా నిలిపారని కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ డిక్లరేషన్ ముసాయిదాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఐ.తిరుమలి, ప్రొఫెసర్ చెన్న బసవయ్య, ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వీరన్న తదితరులు ప్రసంగించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సద్సులో సమన్వయకర్త పల్లవి రెనకె, పల్లపు సమయ్య, ప్రతినిధి వెన్నెల నాగరాజు, యువరాజు, 14 రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు రేణుకా ఆచారి, దిలీప్ సిసోడియా, ఆనంద్ రావు, అంగాల్వర్, మర్తి ముత్తూ, రామ్ సంచారి తదితరులు పాల్గొన్నారు.