సికింద్రాబాద్, మే 26: వ్యాక్సిన్ వేసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కాకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం నుంచి సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్ వేయనున్న సందర్భంగా బుధవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సమీక్షను నిర్వహించారు. వ్యాక్సిన్ ప్రక్రియకు ఫంక్షన్హాల్లో చేపట్టవలసిన చర్యలను వివరించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఎలాంటి తోపులాట జరుగకుండా జాగ్రత్తలు, కేంద్రానికి వచ్చే వారికోసం తాగునీటి వసతిని, ఎండలో ఉండకుండా అవసరమైతే టెంట్ (షామియానా)లు వేయించాలని అధికారులకు సూచించారు. దాదాపు పది రోజుల పాటు కొనసాగే వ్యాక్సిన్ ప్రక్రియలో పారిశుధ్యం, శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్ వేసేందుకు యూపీహెచ్సీ డాక్టర్లు సిద్ధం కావాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి సూపర్ స్పైడర్స్కు సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో వ్యాక్సిన్ వేయనున్న సందర్భంగా బుధవారం యూపీహెచ్సీ డాక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ వేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం డాక్టర్లు, ఇతర సిబ్బంది కూడా సిద్ధం కావాలన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి ప్రత్యేకంగా రూపొందించిన రోజుకో రంగులో ఉండే కూపన్ల పంపిణీ సక్రమంగా, అర్హులకు మాత్రమే అందజేయాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం కూపన్లు పొందినవారు కాకుండా ఇతరులు వ్యాక్సిన్ కేంద్రానికి రాకుండా అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించి, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.