ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 27: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. గతేడాది కాలంలో జీహెచ్ఎంసీ ద్వారా రూ.67 కోట్లు, జలమండలి ద్వారా రూ.ఆరు కోట్ల నిధులతో వివిధ పనులను ప్రారంభించామన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసూరి సునీత, లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, జలమండలి జీఎం రమణారెడ్డి, ఈఈ ఆశాలత, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో యాభై ఏళ్లలో చేపట్టలేని ఎన్నో పనులను కేవలం గడిచిన ఏడేళ్ల వ్యవధిలోనే చేపట్టామని తెలిపారు.