సికింద్రాబాద్, అక్టోబర్ 28: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. వరంగల్లో వచ్చే నెల 15న నిర్వహించనున్న విజయగర్జన సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీతాఫల్మండి డివిజన్లోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఇరవై ఏండ్లు కేసీఆరే ముఖ్యమంత్రి అని పునరుద్ఘాటించారు.
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణకు మరే రాష్ట్రమూ సరితూగదన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్ను కూడా దేశం రోల్మోడల్గా చూస్తున్నదని కొనియాడారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. వరంగల్ సభకు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 20 వేలమంది వరకు కార్యకర్తలు తరలివెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు ఇతర పార్టీలకు లేదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీకి ప్రాణం కార్యకర్తలే. వారు పార్టీ నిర్ణయించిన సభలకు తప్పనిసరిగా హాజరుకావాలి. సభ పూర్తయ్యే వరకు ఉండి విషయాన్ని అవగతం చేసుకుని మన ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యకర్తలు సమయ పాలన పాటించి నిగ్రహంతో ఉన్నప్పుడే సభలు విజయవంతమవుతాయి. దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. మన పార్టీకార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వారని మరోసారి వరంగల్ సభ సందర్భంగా రుజువు చేయాలి. ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు కార్యకర్తలను దగ్గరుండి సభలకు తీసుకుని రావడంతోపాటు సభ పూర్తయ్యే వరకు వాళ్లతోనే ఉండి క్షేమంగా ఇంటికి చేర్చాలని సూచించారు. నూరేండ్లయినా చెక్కుచెదరని విధంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ నిర్మాణం చేపట్టారు. పార్టీ తమ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. – మోతె శ్రీలత, డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ