కరోనా వ్యాప్తి.. అందరూ ఒక్క చోటకు చేరని పరిస్థితి.. ఈ నేపథ్యంలో రంగస్థలం, సినిమా రంగాల్లో ప్రవేశించాలని భావిస్తున్న నవతరం కళాకారులను ఆన్లైన్ వేదిక ద్వారా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోని అన్ని కళారూపాలను ప్రోత్సహించడమే కాకుండా ఆయా విభాగాల్లో కొత్త తరం నటులు, దర్శకులు, రచయితలకు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. అందులో భాగంగానే ఆన్లైన్ విధానంలో సంగీతం, నృత్యం, నాటకం, టీవీ, సినిమా రంగాల్లో నటన, నృత్యం, గానం, రచనలు చేయడంపై ఔత్సాహికులకు శిక్షణనిస్తూ వివిధ రంగాల్లో ప్రవేశించేందుకు అనువైన మార్గాలను సూచిస్తున్నది. టీవీ, సినిమా కథలు రాయడంపై ఆన్లైన్ స్క్రిప్ట్ రైటింగ్ జిమ్నాజియం వర్క్షాప్ పేరుతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 9వారాల పాటు జూమ్ ద్వారా శిక్షణ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనాన్ని చాటిచెప్పేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. అదే విధంగా మన మూలాలను వెతుక్కుంటూ తెలంగాణ చరిత్ర, వాగ్గేయకారులు, వివిధ విభిన్న కళలు, కళాకారులు, మహోన్నత వ్యక్తులను, నిరాదరణకు గురై అంతరించిపోతున్న వాటిని గుర్తించి, వెలికితీసి, బతికిస్తూ, ప్రోత్సహిస్తూ.. పునర్ వైభవం తీసుకు వచ్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నది. అందులో భాగంగానే ఆణిముత్యాల్లాంటి యువ కళాకారులను కళా ప్రపంచానికి అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నదని డైరెక్టర్ మామిడి హరికృష్ణ వెల్లడించారు.
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖాభినయం, జానపదం, కూచిపూడి, కథక్ అంశాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రదర్శనలు కూడా ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా రంగస్థలం (థియేటర్ ఆర్ట్స్) నట శిక్షణ, ప్రదర్శనల నిర్వహణపై తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో శిక్షణ ఇవ్వడం గమనార్హం. శిక్షణ అనంతరం 10 రోజులపాటు ప్రొడక్షన్పై అవగాహన, ఆ తర్వాత బహుభాషా నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేసి కళాకారులకు తగిన ప్రోత్సాహం అందించారు.