కొండాపూర్, ఆగస్టు 24 : మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్యనగర్లో కూలిన భవనం దాటికి దెబ్బతిన్న మరో భవన నిర్మాణ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం మొదలైన కూల్చివేత పనులు అర్ధరాత్రి వరకు సాగాయి. కాగా శనివారం మధ్యాహ్నం అంజయ్యనగర్లో ఏడంతస్తుల భవనం కూలగా, ఈ ప్రమాదంలో శిథిలాల కింద చికుకొని ఇద్దురు మృతి చెందారు. పకనే అపార్ట్మెంట్లోని ఇద్దరు గాయాలపాలయ్యారు. భవన శిథిలాలను హైడ్రా అధికారులు తొలగించి, కుప్పకూలిన భవనం దాటికి పకనే ఉన్న 7 అంతస్తుల భవన నిర్మాణం ప్రమాదకరంగా మారడంతో ఆదివారం నుంచి దెబ్బతిన్న భవనాన్ని హైడ్రా.. భారీ యంత్రం సహాయంతో కూల్చివేత పనులు చేపట్టింది.
ఆదివారం రాత్రి స్థానికులకు ఇబ్బందులు కలగకూడదని పనులు నిలిపివేసిన హైడ్రా అధికారులు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభించారు. భవనం చుట్టూ అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు ఉండడంతో శిథిలాలు వాటి మీద పడకుండా అధికారులు జాగ్రత్తగా కూల్చివేత పనులను నెమ్మదిగా కొనసాగిస్త్తున్నారు. ఈ భవనాల పకనే నాలాపై మరికొన్ని భవనాలు కూడా ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిశీలించి కూల్చివేస్తామన్నారు. మాదాపూర్ సర్కిల్ ఉపకమిషనర్ అంజయ్యనగర్లో పర్యటించి దెబ్బతిన్న, ప్రమాదకరంగా మారిన భవనాలను పరిశీలించారు. మంగళవారం నుంచి మిగతా భవనాల కూల్చివేత పనులను చేపట్టనున్నట్లు సమాచారం.
మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్యనగర్లో అక్రమ భవనం కూలిన ఘటనతో అధికారుల్లో చలనం మొదలైంది. అక్రమ నిర్మాణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో అక్రమ నిర్మాణాల వివరాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది సేకరించారు. నిర్మాణాల అనుమతులు, కట్టడాలు ఎంత వరకు వచ్చాయి, అనుమతులకు మించి కొనసాగుతున్న వాటిని గుర్తించే పనిలో పడ్డారు. కాగా మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో టౌన్ ప్లానింగ్ అధికారుల ఆదేశాల మేరకు ఒక్కో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. కూల్చివేతలను ఇలాగే కొనసాగిస్తారా ? హడావుడి చేసి మళ్లీ పాత కథే కొనసాగిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.