JNTU | సిటీబ్యూరో, ఏప్రిల్ 12: జేఎన్టీయూ అఫిలియేషన్తో కొనసాగుతున్న అన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడంపై యాజమాన్యాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, ఐటీ రంగం పురోగతి వంటి రకరకాల కారణాలతో రెగ్యులర్ కోర్సులను వదిలేస్తున్నారు. గత ఏడాది వరకు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశపెట్టిన ఈ కోర్సులు ఇప్పుడు అన్ని కాలేజీల్లోనూ ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. గత రెండేండ్ల కిందటి వరకు కేవలం టాప్ టెన్ లేదా టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది.
దీంతో జేఎన్టీయూ హైదరాబాద్ కూడా ఆయా కాలేజీలు, కొత్త కోర్సులు, వీటీలో సీట్ల సంఖ్యను అఫిలియేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా దశలవారీగా అన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ అమలు చేయబోతున్నారు. అయితే ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీలతోపాటు నిర్మాణ, ఉత్పాదక రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉండే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, ఈసీఈ వంటి కోర్ గ్రూపు కోర్సులను రద్దు చేసుకుంటున్నారు. అందుకోసం ఇప్పటికే జేఎన్టీయూకు దాదాపు 80కి పైగా ఇంజినీరింగ్ కాలేజీలు కొత్త కోర్సులు, వాటిలో సీట్లు పెంచుకోవడానికి అనుమతి కోరుతూ దరఖాస్తులు చేసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు ధ్రువీకరించారు.
ప్రవేశపెడుతున్న కొత్త కోర్సులివే..
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్ గ్రూపులను వదిలేసి, కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అండ్ మిషన్లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. పైగా.. వాటిలో అధిక సంఖ్యలో సీట్లు పెంచుకుంటున్నారు. సీట్ల సంఖ్య పెంచుకోవడంపై సిద్ధపడిన ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల విషయంలో జేఎన్టీయూ అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు భావిస్తున్నట్లుగా జేఎన్టీయూ నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉండటంలేదు. కోర్ గ్రూపులను పూర్తిగా వేయడానికి యూనివర్సిటీ ఒప్పుకోవడం లేదు. డిమాండ్ లేదన్న కారణంతో ఇంజినీరింగ్ కోర్ గ్రూపుల్లో సీట్ల సంఖ్యలను లేదా డిపార్టుమెంట్లను మూసివేతకు సిద్ధంగాలేదు. అయితే ఆయా డిపార్టుమెంట్లలో కనీసం 30 సీట్లతో తప్పనిసరిగా డిపార్టుమెంట్ను కాలేజీల్లో కొనసాగించాలని, ఆ మేరకు నిబంధనలు విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
2023-24 విద్యా సంవత్సరంలో అఫిలియేషన్లు నిలిపివేయడం లేదని, జేఎన్టీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. అయితే వచ్చే విద్యా సంవత్సరానికి కాలేజీల అఫిలియేషన్లకు యూనివర్సిటీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం అఫిలియేషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.