సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కోర్సుల్లో చేరాలంటే గతంలో ఒక విద్యార్థి మూడు, నాలుగు కాలేజీలకు తిరిగి దరఖాస్తు చేసుకోవడం. కాలేజీలకెళ్లడం, దరఖాస్తులు కొనుగోలు చేయడం, జిరాక్స్ కాపీలను జతపర్చడం జరిగేది. మొదటి లిస్ట్, రెండు, మూడు లిస్ట్ల తర్వాత స్పాట్ సెలెక్షన్స్. ఇలా ప్రతిసారి కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి తిప్పలకు చెక్పెడుతూ వన్ స్టాప్ సొల్యూషన్స్ చూపిస్తోంది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్లాట్ ఫాం. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, అన్ని డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ ఇది. ఒకే ఒక్క బటన్తో ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవడం, సీట్లు పొందడం వంటి ప్రత్యేకతలు గలది. అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి రాష్ట్రంలోని ఎక్కడి విద్యార్థి అయినా ఎక్కడైనా చదువుకునే అద్భుత అవకాశాన్ని దోస్త్ కల్పించింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి 2016వ సంవత్సరంలో దోస్త్ సేవలను ప్రారంభించింది. ఎనిమిదేండ్ల క్రితం విప్లవాత్మక మార్పుగా ప్రవేశపెట్టిన దోస్త్ 2024 అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇటీవలే విడుదలయ్యింది. ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు ప్రక్రియ కొనసాగుతున్నది.
దోస్త్ పరిధిలో గతంలో ఏడు వర్సిటీలుండగా, ఇటీవలీ కాలంలో కొత్తగా ఏర్పడ్డ మహిళా వర్సిటీలోని సీట్లను సైతం దోస్త్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూ, సాంకేతిక విద్యా మండలి, తెలంగాణ మహిళా వర్సిటీల్లోని మూడేండ్ల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసింది. ప్రస్తుతం, మూడో విడత కౌన్సెలింగ్ నడుస్తోంది. జూలై 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశముండగా, జూలై 3 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశానిచ్చారు. 6న మూడో విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 15 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మొదటి, రెండు విడతల్లోను కామర్స్ కోర్సులోనే అత్యధికులు ప్రవేశాలు పొందారు.
సెల్ఫీతో దరఖాస్తు…
సులభంగా దరఖాస్తు చేయడం, విద్యార్థులు ఎక్కడికెళ్లకుండా ఇంట్లో నుంచే మొబైల్ ద్వారా దరఖాస్తు చేసేందుకు దోస్త్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. కేవలం సెల్ఫీ తీసి, ఫొటోను అప్లోడ్ చేస్తే, విద్యార్థి వివరాలు ప్రత్యక్షమయ్యేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు. ఇంటర్ బోర్డు ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. టీ యాప్ ఫొలియో రియల్ టైం ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా విద్యార్థి వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇదే కాకుండా ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్, తల్లిదండ్రుల మొబైల్ నంబర్, మీ సేవా కేంద్రాల ద్వారా సైతం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నాలుగు కొత్త కోర్సులు..
కాలానుగుణంగా డిగ్రీలో కొత్త కోర్సులను సైతం అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఏడాది నాలుగు కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది నాలుగు కొత్త కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టారు. 14 కాలేజీల్లో బీకాం ఫైనాన్స్, మరికొన్ని కాలేజీల్లో బీఏ (స్పెషల్) హెచ్ఈపీ, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్, బీఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సులను ప్రవేశపెట్టగా, ఇక 20 అటానమస్ కాలేజీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్స్యూరెన్స్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఏ)ను ఎలక్టివ్గా ప్రవేశపెట్టారు. నిరుడు నాలుగేండ్ల బీఎస్సీ కంప్యూటర్సైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. జపనీస్, జర్మనీ భాషలను సైతం రెండోభాషగా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఏటా కామర్స్ కోర్సులు విపరీతమైన డిమాండ్ ఉంటుండగా, లైఫ్ సైనెన్స్ కోర్సులకు సైతం భారీగానే డిమాండ్ ఉంటున్నది.
దోస్త్ బాటలో ఐదు రాష్ర్టాలు..
రాష్ట్రంలో అమలు చేస్తున్న దోస్త్ ప్రయోగం యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నది. పలు రాష్ర్టాలను ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ తరహా ఆన్లైన్ ప్రవేశాలను అమలుచేస్తుండగా, మరికొన్ని రాష్ర్టాలు సైతం ముందుకొస్తున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు దోస్త్ తరహాలోనే అడ్మిషన్లు చేపడుతున్నాయి. మరికొన్ని రాష్ర్టాలు తెలంగాణలోని దోస్త్ను అధ్యయనం చేసి ఇదే తరహా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
2020-21 నుంచి బకెట్
దోస్త్లో భాగంగా 2020-21వ సంవత్సరం నుంచి బకెట్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. దీంతో కోర్సుల స్వరూపమే మారిపోయింది. ఇది వరకు బీఎస్సీ బాటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులు చదివిన వారు, కొత్తగా సైకాలజీ చదివే అవకాశముంది. అంతే కాకుండా గణితం, స్టాటిస్టిక్స్ విద్యార్థులు ఎకనామిక్స్ను చదవొచ్చు. ఇలా వినూత్న కాంబినేషన్లు బకెట్ సిస్టం ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంలో ఒక్క బేగంపేట మహిళా కాలేజీలో 56 రకాల కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. సిటీ కాలేజీలోను 50కి పైగా సబ్జెక్టు కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి.
దోస్త్ ప్రత్యేకతలు..