సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ఎయిర్ పోర్టు మెట్రో సౌకర్యాలు, కార్యకలాపాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. శనివారం ఢిల్లీ వెళ్లిన హైదరాబాద్ మెట్రో రైలు బృందం అక్కడి మెట్రో ప్రాజెక్టు నిర్వహణ, కల్పించిన మౌలిక వసతులను ప్రత్యేకంగా పరిశీలించింది. రెండు సిటీ మెట్రో స్టేషన్లలో చెక్ ఇన్ చేసే విధానం అమల్లో ఉన్నట్లు తెలుసుకున్నది. అదేవిధంగా విమానాశ్రయానికి బదిలీ చేసిన సామాను విమానాశ్రయం వైపు బదిలీకి సంబంధించిన సౌకర్యాలను, ఇతర కార్యకలాపాలను ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం ఆయన తన బృందంతో న్యూఢిల్లీ స్టేషన్కు ప్రయాణం చేశారు. న్యూఢిల్లీ స్టేషన్లో నగరం వైపు చెక్ ఇన్ సౌకర్యాన్ని పరిశీలించారు. ఢిల్లీ చుట్టుపకల ఉన్న వివిధ పట్టణాలు,నగరాలకు హై స్పీడ్ రైలు కనెక్టివిటీని అభివృద్ధి చేస్తున్న రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కొనసాగుతున్న పనులతో పాటు ఎయిర్పోర్టు మెట్రో నిర్వహణ డిపో , ఇతర సౌకర్యాలను కూడా ఈ బృందం పరిశీలించింది. చివరకు ఎన్వీఎస్రెడ్డి ఆయన బృందం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఎండీవీకే సింగ్, సీనియర్ ఇంజినీర్ల బృందాలతో పరస్పర అనుభవాలను పంచుకున్నారు.