మేడ్చల్, జనవరి 21 : మిద్దె తోటలతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చని మల్లారెడ్డి విశ్వ విద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ డీన్ డాక్టర్ రాజారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న కిసాన్ మహోత్సవంలో భాగంగా ఆదివారం మిద్దె తోటలు, ఆరోగ్య అలవాట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ.. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మిద్దె తోటలపై దృష్టి సారించాలన్నారు. మిద్దె తోటల ద్వారా రసాయనిక మందులు లేని కూరగాయలు, ఆకు కూరలను పండించుకోవచ్చన్నారు. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. అంతేగాకుండా ఆర్థికంగా లాభపడవచ్చని, ఉదయాన్నే మిద్దె తోటల్లో పని చేయడం ద్వారా కసరత్తు జరుగుతుందన్నారు.
అభిరుచి ఉన్న గృహిణిలతో పాటు ఉద్యోగం చేసే మహిళలు సైతం హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్ తదితర పట్టణాల్లో మిద్దె తోటల సాగుతో లబ్ధి పొందుతున్నారని చెప్పారు. అల్యూమినియం పాత్రల్లో కంటే కంచు పాత్రల్లో ఆహారాన్ని వండుకోవడం మంచిదని ప్రకృతి ప్రసాద్ తెలిపారు. అనంతరం విజయవంతంగా మిద్దె తోటలను సాగు చేస్తున్న మహిళలను అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాఘవరావు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.