పీర్జాదిగూడ, నవంబర్ 2: గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్ కట్ట మైసమ్మ వైన్స్ సమీపంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికులకు కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడికి సుమారు 55 ఏండ్ల వయస్సు ఉంటుందని, ఒంటిపై తెలుపు రంగు చెక్స్తో షర్టు, నీలిరంగు నెక్కర్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మేడిపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు.