సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): ఎలాంటి అర్హత లేకున్నా ఆర్ఎంపీ ముసుగులో రోగులకు చికిత్స చేయడమే కాకుండా అనుమతి లేకుండా ఔషధాలు సైతం విక్రయిస్తున్న మూడు క్లినిక్లపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. డీసీఏ డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి కథనం ప్రకారం..
జీడిమెట్ల షాపూర్నగర్లో ఎలాంటి అర్హతలు లేకుండానే అశోక్కుమార్, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జలంధర్ స్థానికంగా ఉన్న యెదిర గ్రామంలో, జయశంకర్ భూపాలపల్లికి చెందిన బక్కతాట్ల నగేశ్ స్థానికంగా ఉన్న సింగంపల్లె గ్రామంలో అనధికారికంగా క్లినిక్ నిర్వహిస్తున్నారు. అంతే కాకుండీ డీసీఏ అనుమతి లేకుండా ఔషధాలను సైతం విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు ఈ మూడు చోట్ల క్లినిక్లపై దాడులు జరిపి కేసులు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.95వేల విలువ చేసే 30 రకాల ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఔషధాలపై ప్రకటనలు ముద్రించిన ఫార్మా కంపెనీపై…
నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు ముద్రించిన ఓ ఫార్మా కంపెనీకి డీసీఏ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పాటు మందులను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే… ‘మహాసుదర్శన కధా’ అనే ఔషధంపై ‘జ్వరం చికిత్స కోసం’ అని తయారీ సంస్థ ముద్రించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు సదరు ఔషధ తయారీ సంస్థ ఓమ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్తో పాటు మార్కెటింగ్ చేస్తున్న శ్రీధూతపాపేస్వర్ లిమిటెడ్కు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా అధిక ధరలకు ఔషధాలు విక్రయిస్తున్న పలు మెడికల్ షాపులపై సంగారెడ్డి డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ‘ఇట్రాకోనజోల్’ మాత్రలను సీజ్ చేసి, ఔషధ తయారీ సంస్థకు నోటీసులు జారీ చేశారు.