సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో 11వ రోజు నాటికి లక్ష మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్లో 274 కేంద్రాల్లో 31,029 మందికి కంటి పరీక్షలు చేశారు. అందులో 8860 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 4,610 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో..
నగరంలో 115 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. 11వ రోజు మొత్తం 12,356 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 4,106 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 1791మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో..
జిల్లా పరిధిలో మొత్తం 80 కేంద్రాల ద్వారా కంటివెలుగు కార్యక్రమం జరిపినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,133 మందికి కంటి పరీక్షలు జరిపామని, వారిలో 1825 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా,1585 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామన్నారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో..
మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 79 కేంద్రాల ద్వారా 8540 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. వారిలో 2,929 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశామని, 1234 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఐదవ వార్డు సంజీవయ్యనగర్ కమ్యూనీటిహాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విశాల్, ఎస్పిహెచ్ఓ డాక్టర్ రాజకుమారి, డాక్టర్ శ్రీలక్ష్మి, బస్తీ ప్రెసిడెంట్ కొంపల్లి దాసు, నర్సింగ్, అనిల్, శివ, రవి, సుధాకర్, మహంకాళి శర్వీన్, పాల్గొన్నారు.