అల్వాల్, డిసెంబర్ 27: ఒత్తిడిని తట్టుకోలేని కూతురు ఆత్మహత్య చేసుకోగా.. అది చూసి మనస్తాపంతో తల్లి కూడా బలవన్మరణం చెందింది. ఈ విషాద ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసాలా బజార్లో జరిగింది. అల్వాల్ ఎస్సై పరశురాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా నవీపేట్కు చెందిన మానె శారద (51) తన కూతురు మౌనిక (26)తో కలిసి మచ్చబొల్లారంలోని రిసాలాబజార్లో ఉంటున్నారు. శారద భర్త సంజయ్ నాలుగేండ్ల కిందట మరణించాడు. అప్పటి నుంచి మౌనిక డిప్రెషన్లోనే ఉండేది. శారదా ప్రైవేటులో ఉద్యోగం చేస్తుండగా.. మౌనిక ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసి, మానసిక ఒత్తిడితో ఉద్యోగం మానేసింది. అయితే, ఉద్యోగం మానేసి తల్లికి భారంగా మారానంటూ బాధపడింది.
ఈ క్రమంలోనే సోమవారం తల్లి శారద పనికి వెళ్లిన తర్వాత తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోవడం, తల్లికి భారమవుతున్నాననే మనోవేదనతో మౌనిక ఇంట్లోని కిచెన్లో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన శారద.. ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన కూతురిని చూసి షాక్కు గురైంది. గుండెలవిసేలా రోదించింది. గతంలో భర్త, ఇప్పుడు కూతురు కూడా దూరమవడంతో మనస్తాపం చెందింది. ఇంట్లోని ఫ్యాన్ ఉక్కుకు చీరతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం వారిద్దరూ బయటికి రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించగా.. ఇద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. శారద సోదరి బబిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తమ సోదరి, ఆమె కూతురు మరణాలపై తమకు ఎలాంటి అనుమానం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై పరశురాం వెల్లడించారు.