సిటీబ్యూరో, జనవరి 18(నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ, పోలీసుల ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. ఆదివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో భవనం మొదటి అంతస్తులో ప్రమాదం ప్రారంభమైందని అధికారులు గుర్తించారు. భవనంలోని ఇంటీరియర్ డిజైన్ అధికంగా చెక్కతో చేయడం, అందులో మద్యం బాటిళ్లు ఉండడంతో మంటలు వేగంగా విస్తరించాయి. నగరంలో భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు రావడంతో షార్ట్ సర్క్యూట్ అయి అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇతర విద్యుత్ పరికరాలు నడుస్తుండడంతోనే షార్ట్ సర్క్యూట్ అయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించాలని మారేడ్పల్లి పోలీసులు అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులకు లేఖలు రాశారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత పోలీసుల దర్యాప్తు మరింత వేగంగా కొనసాగనుంది. ఇప్పటి వరకు వచ్చిన అనుమానాలు, ఆరోపణల కోణంలో దర్యాప్తు చేసినా ఆధారాలు లభించలేదని సమాచారం.
ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి ఈ రెండు శాఖల నివేదికలతో సంఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇప్పటికే పోలీసు క్లూస్ టీం సేకరించిన ఆధారాలను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపారు. ఆ నివేదిక కూడా తోడైన తర్వాత మొత్తం అగ్నిప్రమాదం మీద స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ క్లబ్ యాజమాన్యం రూ. 25 కోట్ల నష్టం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మాత్రం రూ. 14 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరో వైపు అగ్నిమాపక సిబ్బంది చేసిన దర్యాప్తులో క్లబ్కు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్వోసీ లేదని తేలింది. దీనిపై అగ్నిమాపక శాఖ అధికారులు కేసును నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా క్లబ్లో అగ్నిప్రమాద నివారణ పరికరాలు కూడా సరైన తీరులో లేవని గుర్తించినట్లు అగ్నిమాపక శాఖ రీజినల్ డైరెక్టర్ పాపయ్య చెప్పారు.
అగ్నిమాపక శాఖ స్పెషల్ డ్రైవ్
సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదంతో రాష్ట్రవ్యాప్తంగా క్లబ్లు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్లపై అగ్నిమాపక శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 356 సినిమా థియేటర్లలో తనిఖీలు చేశారు. సినిమా థియేటర్ల యాజమాన్యం అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ తీసుకుందా ..? లేదా..? అని పరిశీలిస్తున్నారు. ఎన్వోసీలు లేనివారిపై కేసులు నమోదు చేస్తామని రీజినల్ ఫైర్ ఆఫీసర్ (సెంట్రల్ జోన్) పాపయ్య హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 23 క్లబ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిబంధనలను పాటించడంలో లోపాలు ఉంటే వారికి నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు.