హిమాయత్నగర్,ఏప్రిల్2: రాష్ట్రంలోని దళితులు సంఘటిత శక్తిగా ఎదిగి ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్ల మూరి కృష్ణస్వరూప్ పిలుపు నిచ్చారు. శనివారం హిమాయత్నగర్లో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామిక, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకంగా పాలన చేస్తోందని విమర్శించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా, నిచ్చేడ్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మనువాద శక్తులు కుట్రలు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని అవమాన పరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు చేపూరి రాజు,ప్రవీణ్కుమార్,డాక్టర్ వీఎల్రాజు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.