బంజారాహిల్స్,ఆగస్టు 16 : దేశానికే దిక్సూచిలాంటి పథకాలను రూపొందించి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా మరో చరిత్ర సృష్టించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ చేతులమీదుగా దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో ఫిలింనగర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, వివిధ సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముందున్న సీఎం కేసీఆర్, దళిత బంధు పథకాన్ని ప్రారంభించారన్నారు. దళిత బంధును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజలంతా గుర్తించారని, వారికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
రైతులను ఆదుకునేందుకు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారని, ఇదే ఒరవడిలో దళిత బంధు పథకం కూడా విజయం సాధించడం ఖాయమన్నారు. అనంతరం పెద్దసంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ హుజూరాబాద్లో దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి తరలివెళ్లారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, అబ్దుల్ ఘని, నగేష్, దయ్యాల దాసు, రవి తదితరులు పాల్గొన్నారు.