ఇచ్చిన మాట ప్రకారం 24గంటల లోపే ‘దళితబంధు’ నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
76 కుటుంబాలకు రూ.7.60కోట్ల నిధుల విడుదలతో అంబరాన్నంటిన సంబురాలు
తెలంగాణ ‘దళిత బంధు’ పథకం రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచే అమలులోకి రావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మిషన్ భగీరథ, నేతన్నకు చేయూత పథకాలకు నాందిగా నిలిచి రాష్ర్టానికే ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా ‘దళిత బంధు’ అమలుకు కూడా వేదికై నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇచ్చిన మాట ప్రకారం..76 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున రూ.7.60కోట్లను విడుదల చేస్తూ గురువారం జీవో వెలువడడంతో దళిత కుటుంబాలు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. తొలి ఫలాలు అందుకుంటున్న వాసాలమర్రిలో సంబురాలు మిన్నంటాయి. దళిత వాడల్లో దండోరా మోగింది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే చరిత్రాత్మక పథకాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. దళితులు ధనికులుగా ఎదగాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షను తప్పక సాకారం చేస్తామని దళితులు దరువేసి చెప్పారు. చిన్న, పెద్దా.. అందరూ రంగులు చల్లుకుని ఆడిపాడారు. చక్కెరతో నోటిని తీపి చేసుకుని ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు. ఆద్యంతం వాసాలమర్రిలో పండుగ వాతావరణం కనిపించింది.
రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని లక్షా 20వేల కోట్లతో ప్రభుత్వం అమలు చేయాలని సంకల్పించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని అమలులోకి తెస్తూ జీవో ఎంఎస్ నంబర్ 6ను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధి(ఎస్సీ,ఎస్టీఎఫ్) కింద ఇప్పటికే కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాలతో సంబంధం లేకుండా దళిత బంధు పథకం అమలుకానుంది. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రూ.10లక్షల చొప్పున నగదు సహాయాన్ని పూర్తి గ్రాంటు రూపంలో అందజేయనున్నారు.
రాజాపేట, ఆగస్టు 5 : దళిత బంధు అమలు కావడంతో రాజాపేటలో దళితులు డప్పు కొట్టి దండోరా వేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి తమ పాలిట దేవుడంటూ కొనియాడారు. దళితులను ధనికులను చేయాలని పథకం రుపొందించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు కోయ బాలరాజు, సగ్గు ఆంజనేయులు, కోయ జహంగీర్, భాగ్య, లక్ష్మి, వరలక్ష్మి, స్వర్ణ, వసంత, అనిత పాల్గొన్నారు.
దళితబంధు వాసాలమర్రిలోనే అమలు కావడం మా అదృష్టం..
దళితబంధు పథకం తమ నియోజకవర్గమైన ఆలేరులోని వాసాలమర్రిలోనే అమలు చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఈ పథకం అమలు చరిత్రలో నిలిచిపోతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. 24 గంటల్లోపే వాసాలమర్రికి చెందిన 76 దళితకుటుంబాలకు రూ. 7.60 కోట్ల నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు.
నిధుల విడుదల సందర్భంగా గురువారం వాసాలమర్రిలోని దళిత వాడల్లో పండుగ వాతావరణం కన్పించింది. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. ‘జై కేసీఆర్..జైజై కేసీఆర్’ అంటూ నినదించారు. చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధులంతా డ్యాన్స్లు చేశారు. కొందరు ఏకంగా సీఎం కేసీఆర్ చిత్రపటాన్నే నెత్తిన పెట్టుకుని ఆనందం తాండవం చేశారు. దళిత బంధువుకు బాటలు వేయడంలో ప్రత్యేక చొరవ చూపారంటూ.. గ్రామ సర్పంచు ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్ కుమార్ను ఎత్తుకుని చిందులు వేశారు. దళిత మహిళలు బతుకమ్మ ఆడి కేసీఆర్పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ తమ దేవుడంటూ వేనోళ్ల పొగిడారు.
మోటకొండూర్, ఆగస్టు 5: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చరిత్రలో నిలిచిపోతుందని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు బోడ మహేశ్ కొనియాడారు.వాసాలమర్రి గ్రామంలో ఉన్న దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి దంపతుల చిత్రపటానికి గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు.