ముషీరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితుల ఓట్లు చీల్చే కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీజేపీలు తెర వెనక మంద కృష్ణ మాదిగను బరిలోకి దించడానికి ప్రయత్నిస్తున్నాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు సిద్దాంతాలను పక్కన పెట్టి రాజకీయ స్వార్థం కోసం జట్టుకట్టి దళితులకు సంక్షేమ ఫలాలు అందకుండా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల్లో దళితులంతా తమ సంక్షేమానికి పాటుపడుతున్న పార్టీకే అండగా నిలవాలని నిర్ణయించుకున్నారని, ఇది మింగుడు పడని దళిత ద్రోహులు, కాంగ్రెస్, బీజేపీలు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నడూ లేనివిధంగా జనరల్ సీటులో ఎస్సీ అభ్యర్థిని బరిలో నిలపడానికి ప్రయత్నిస్తుండటం, తెరవెనక బీజేపీతో కలిసి మహాజన పార్టీ తరుపున మంద కృష్ణను ఎన్నికల బరిలోకి దించే ప్రయత్నం చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. జనరల్ సీటులో కాంగ్రెస్ ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టడమంటే పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వడమేనని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్లు దళితులకు శాశ్వత శత్రువులని వారిని రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడు నమ్మడని అన్నారు. బీజేపీకి మంద కృష్ణపై ప్రేమ ఉంటే హుజురాబాద్లో అభ్యర్థిగా ఆయన పేరే ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితుల బాగుకోసం సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దళిత బంధు అమలుకు పూనుకుంటే మంద కృష్ణ అడ్డుపడే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితులకు నష్టం చేసే చర్యల్లో భాగంగా మంద కృష్ణ హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తే దళితులే తగిన బుద్దిచెప్తారని అన్నారు. విలేకరుల సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు పీ.సంజీవ, రమేష్, చందు, వెంకట్, ఎల్లేష్, రాజేష్లు పాల్గొన్నారు.