కంటోన్మెంట్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ అంకురార్పణ చేస్తున్న దళిత బంధు పథకం చరిత్రలో నిలుస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. దళితుల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి దళిత బంధు పథకానికి రూపకల్పన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం పికెట్లోని అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడి నుంచి కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయం వద్ద భారీ వాహనశ్రేణితో హుజూరాబాద్లో జరగనున్న సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ప్రారంభంలో భాగప్వాములమయ్యే అద్భుత అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా దళితులు ఎదిగేందుకు ఈ పథకం ఎంతో తోడ్పాటునందిస్తుందని చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలువనున్న ఈ పథకం ఎంతోమంది దళితులకు బాసటగా నిలువబోతుందని వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ మహంకాళి శర్విన్, టీఆర్ఎస్ నేతలు ముప్పిడి మధుకర్, నివేదితా, నర్సింహ్మా ముదిరాజ్, కసిరెడ్డి నరేందర్రెడ్డి, పనస సంతోష్, తేజ్పాల్, మురళీయాదవ్, పిట్ల నగేష్, లతా మహేందర్, కుమార్ ముదిరాజ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.