హైదరాబాద్ : ఆస్తి వివాదంతో ఉరేసుకున్న ఓ వ్యక్తికి డయల్ 100 ఊపిరి పోసింది. సకాలంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది.. ఉరేసుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడి, ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. ఈ ఘటన హైదరాబాద్ ఆసిఫ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రేతిబౌలిలో మంగళవారం చోటు చేసుకుంది.
రేతిబౌలికి చెందిన ఓ వ్యక్తికి తన అన్నదమ్ముళ్లతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ గొడవలు ఇటీవల ఎక్కువగా కావడంతో బాధిత వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రోజు తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన భార్య రాధ.. 100కు డయల్ చేసింది. ఇక క్షణాల్లోనే పెట్రోలింగ్ సిబ్బంది ఆ ఇంటి వద్ద వాలిపోయారు. ఆ గది తలుపులను పగులగొట్టి.. ఉరేసుకున్న వ్యక్తిని కిందకు దించారు పోలీసులు.
అయితే హరీశ్ అనే పోలీసు కానిస్టేబుల్.. ఉరేసుకున్న వ్యక్తికి కొన ఊపిరి ఉన్నట్టు గుర్తించాడు. దీంతో బాధిత వ్యక్తి ఛాతీపై బలంగా నొక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ఉరేసుకున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ హరీశ్, సంతోష్ కుమార్, సురేశ్ కుమార్(హోంగార్డ్)తో పాటు ప్రొబేషనరీ ఎస్ఐ ఎం సందీప్పై పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపించారు.