సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ): ఒకవైపు చమురు ధరల మోతను కొనసాగిస్తున్న ఇంధన సంస్థలు గ్యాస్ పైనా ధరలు పెంచి.. సామాన్యుడిని బాదుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సామాన్యుడిపై ఆర్థికంగా భారం పెరుగుతున్నది. ప్రధానంగా గత ఆర్నెల్లలో అటు పెట్రోలు, డీజిల్తో పాటు ఇటు గ్యాస్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. తాజాగా, చమురు సంస్థలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.25ల మేర పెంచాయి. కమర్షియల్ సిలిండర్పై దాదాపు 85.50 మేర అదనపు భారాన్ని మోపుతున్నాయి.
ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో దాదాపు 25 లక్షల వరకు డొమెస్టిక్ సిలిండర్ కనెక్షన్లు ఉండగా, కమర్షియల్వి సుమారు 50-70 వేల మేరకు ఉన్నాయి. చమురు సంస్థలు తాజాగా పెంచిన ధరతో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.887 చేరగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.1768కు చేరుకుంది. చమురు సంస్థలు గ్యాస్ ధరను పెంచడం గత ఆర్నెల్ల వ్యవధిలో ఇది ఐదోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన డొమెస్టిక్ సిలిండర్పై అప్పటి ధర కంటే రూ.25 మేర పెంచిన చమురు సంస్థలు ఆపై అదే నెల 15వ తేదీన రూ.50, 25వ తేదీన రూ.25లు పెంచాయి.
అంటే కేవలం ఫిబ్రవరి నెలలోనే ఏకంగా రూ.100 పెంచాయి. ఆపై మార్చి 25న రూ.25 మేర పెంచిన సంస్థలు, ఏప్రిల్ ఒకటిన మాత్రం రూ.10లు తగ్గించాయి. తిరిగి తాజాగా మరో రూ.25లు పెంచాయి. అంటే గత ఆర్నెల్ల వ్యవధిలోనే డొమెస్టిక్ సిలిండర్పై ఏకంగా రూ.140లు పెంచడం సామాన్యుడికి గుదిబండలా మారింది.