సిటీబ్యూరో, అగస్టు 24(నమస్తే తెలంగాణ): సైకిల్ పోయిందని జ్వరంతో బాధపడుతున్న ఓ బాలుడు సైకిల్ దొరకడంతో ఖుషీ అయ్యాడు. పోలీసులకు థ్యాంక్స్ చెప్పాడు. సనత్నగర్ ప్రాంతానికి చెందిన సుప్రియ ఎనిమిదవ తరగతి చదువుతున్న తన కుమారుడు వెంకట సత్యనారాయణకు స్కూల్, ట్యూషన్కు వెళ్లేందుకు రూ.15 వేలు పెట్టి సైకిల్ కొనిచ్చింది. దీంతో ఆ సైకిల్ను కంటికిరెప్పలా చూసుకుంటున్నాడు. జూలై నెలలో ఆ సైకిల్ను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటనతో వెంకట్ జ్వరం బారిన పడ్డాడు. కుమారుడి పరిస్థితిని చూసి తల్లి సుప్రియ సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైకిలే కదా అని తేలిగ్గా చూడకుండా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి 10 రోజుల్లో దొంగను పట్టుకున్నారు. సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చోరీకి గురైన సైకిల్ చేతికి అందడంతో వెంకట్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.