Gandipet | సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనున్నది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే లేక్ వ్యూ పార్క్ను రూ.36 కోట్లతో అద్భుతంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) సంస్థ, రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇటీవల ఇదే విషయమై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గండిపేట జలాశయం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు గండిపేట అభివృద్ధిపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఐటీ రంగం అభివృద్ధితో హైదరాబాద్ మహానగరం పడమర దిక్కున శరవేగంగా విస్తరిస్తోంది. ఐటీ కారిడార్లోని ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట వంటి ప్రాంతాలకు సమీపంలోనే గండిపేట జలాశయం ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరహాలో గండిపేట కింద భాగంలో పదుల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటయ్యాయి. ఐటీ రంగంతో పాటు సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారికి గండిపేట చుట్టు పక్కల ప్రాంతాలు నివాస కేంద్రాలు మారాయి. దీంతో జంటనగరాల్లో హుస్సేన్సాగర్ తరహాలో సైబరాబాద్ పరిధిలో గండిపేట పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపట్టేందుకు క్షేత్ర స్థాయిలో సర్వే పనులు మొదలు పెట్టనున్నారు.
గండిపేట జలాశయం 100 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గండిపేటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించింది. సుమారు రూ.100 కోట్ల నిధులతో గండిపేట చెరువును పూర్తి స్థాయిలో పరిరక్షించడంతో పాటు చుట్టూ 46 కి.మీ మేర వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే గండిపేట లేక్ వ్యూ పార్కును రూ.36 కోట్లతో నిర్మిస్తే, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అదే స్థాయిలో గండిపేట చుట్టూ సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసే పనులు మొదలయ్యాయి.
భవిష్యత్లో మహానగరానికి తాగునీటి సమస్యలు రావొద్దని, చెన్నైలో ఎదురవుతున్న నీటి ఎద్దడి పరిస్థితులు మన నగరానికి ఉండొద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి కోసమే కాకుండా నగరానికి తాగునీటిని అందించేలా డిజైన్ చేశారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా సిటీకి నీటిని సరఫరా చేయాలని, అదే సమయంలో అక్కడి నుంచి గండిపేటకు నీటిని తరలించడం ద్వారా ఎప్పటికీ నగరంలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలనేది భవిష్యత్ ప్రణాళిక.