యూకే నుంచి మీకు పార్సిల్ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన కొరియర్ను మేం ఎక్కువ రోజులు డిపాజిట్ ఉంచుకోలేము. దీనికి డెలివరీ చార్జీలు పే చేయలేదు… స్కాన్ చేస్తే అందులో పౌండ్స్ ఉన్నాయని ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి అంటూ ఒకరి బెదిరింపులు.
మీ పేరుతో ఆఫ్రికా నుంచి పార్సిల్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి. మేం దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నాం. మేం ముంబై ఎయిర్ పోర్టు నుంచి మాట్లాడుతున్నామంటూ మరొకరి బెదిరింపులు.
ఇలాంటి బెదిరింపులతో హడలిపోయి బాధితులు వెంటనే సైబర్ నేరగాళ్లు సూచించే ఖాతాలలో డబ్బు డిపాజిట్ చేస్తూ మోసానికి గురవుతున్నారు. డబ్బు చెల్లించకముందే బాధితులు ఒక్క నిమిషం ఆగండి. ఆలోచించండి. మిత్రులు, కుటుంబసభ్యుల సహకారం తీసుకోండి. ఒక్కసారి ఫోన్ చేసి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు తెలుపండి. మీకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తారు. అంతే కానీ ఎవరికైనా చెబితే పరువు పోతుందని కొందరు, వచ్చే పార్సిల్లో డాలర్లు, పౌండ్స్ ఉన్నాయి, ఇతరులకు తెలిస్తే కష్టమనే అత్యాశతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి విలవిలలాడుతున్నారు. మోసపోకముందే.. తేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): యూకే నుంచి మీ పేరుతో పార్సిల్ వచ్చింది.. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన కొరియర్. దానిని మేం ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచుకోలేము.. ఈ పార్సిల్కు డెలివరీ చార్జీలు కూడా చెల్లించలేదు.. స్కాన్ చేస్తే అందులో పౌండ్స్ ఉన్నాయి.. అంటూ ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారుల పేరుతో బెదిరింపులు…
మీ పేరుతో ఆఫ్రికా నుంచి ఒక పార్సిల్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి. మేం దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నాం. వెంటనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోండి. మేం ముంబై ఎయిర్ పోర్టు నుంచి మాట్లాడుతున్నాం.. అంటూ బెదిరింపులు…
ఇలా వస్తున్న బెదిరింపులతో హడలిపోతున్న బాధితులు భయంతో వెంటనే సైబర్నేరగాళ్లు సూచించే ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేస్తూ మోసపోతున్నారు. బాధితుల భయం.. నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఇలాంటి ఫోన్స్ రాగానే తెలిసిన వారి సహాయం తీసుకొని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అయితే, తెలిసిన వారికి, పోలీసులకు చెబితే పరువుపోతుందన్న భయంతో చాలా మంది నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. వారు చెప్పినట్టు చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
చెల్లించక ముందే చెబితే..!
గుడిమల్కాపూర్లో నివాసముండే ఓ ప్రైవేట్ ఉద్యోగినికి లింక్డ్ ఇన్ ద్వారా యూకేలో ఉండే ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో వారు చేసే వృత్తి గూర్చి మాట్లాడుకోవడంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలపై కూడా చర్చించుకున్నారు. కొన్ని రోజుల తరువాత ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి రాకేశ్ను మాట్లాడుతున్నాను..
మీ పేరుతో లండన్ నుంచి ఒక పార్సిల్ వచ్చిందంటూ చెప్పాడు. అందులో అడ్రస్ కూడా చెప్పాడు. లింక్డిన్లో పరిచయమై.. ఆ తరువాత +44 వాట్సాప్ నంబర్తో చాట్ చేసిన వ్యక్తి పంపించాడని ఆమె గ్రహించింది. ఆ పార్సిల్ మీకు పంపించాలంటే దానికి డెలివరీ ఛార్జీలు రూ. 42,999 చెల్లించాలంటూ షరతు విధించాడు. డబ్బులు పంపేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే, రాకేశ్ ఆమె ఫోన్కు మెసేజ్ పెట్టాడు. ఆ పార్సిల్ను స్కాన్ చేస్తే అందులో 80 వేల పౌండ్లు ఉన్నాయని తెలిసిందని, దీనికి యాంటీ మనీ లాండరింగ్ సర్టిఫికెట్ అవసరమంటూ సూచించాడు. దానికి రూ. 2 .15 లక్షలు ఖర్చవుతుందంటూ చెప్పాడు.
మీరు త్వరగా చెల్లిస్తే పార్సిల్ పంపిస్తాను.. లేదంటే మీ ఇష్టమంటూ రాకేశ్ తేల్చి చెప్పాడు. వెంటనే తనకు లింక్డిన్లో పరిచయమైన యూకేలోని వ్యక్తికి మెసేజ్ చేసింది. అవును ఆ పార్సిల్ నేను పంపించాను.. మీ అమ్మకు ఆపరేషన్ ఖర్చుల కోసం అంటూ చెప్పాడు. నాకు సమస్య తెచ్చిపెట్టకు.. నీవు వెంటనే ఆ ఫీజులు చెల్లించి, ఆ పార్సిల్ తెప్పించుకోమంటూ సూచించాడు. తన కోసం నిజంగానే పంపించాడనే భావనతో తన స్నేహితుల వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకొని.. నేరగాడు సూచించిన ఖాతాలోకి డిపాజిట్ చేసింది. ఇంకా డబ్బు కావాలంటూ అడగడంతో అనుమానం వచ్చి తనకు తెలిసిన చార్టెడ్ అకౌంటెంట్కు ఫోన్ చేసింది. ఆ తరువాత విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది.ఇదంతా ఫేక్ అని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమంటూ సూచించడంతో సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నగరానికి చెందిన ఒక మహిళకు.. ముంబై ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేశారు. మీ పేరుతో ఆఫ్రికా నుంచి ఒక పార్సిల్ వచ్చిందని చెప్పారు. తనకు ఎవరు ఆఫ్రికాలో తెలియరని, మీరు పొరపాటుగా ఫోన్ చేశారని బాధితురాలు సూచించింది. అది కాదని.. మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇదే కదా.. అంటూ చదివారు. ఆ అడ్రస్ తనదేనంటూ ఆమె ఖంగుతిన్నది. ఈ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి.. మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది.. ఈ పార్సిల్ను సీబీఐకి అప్పగిస్తామంటూ బెదిరింపులకు దిగారు.
తనకు సంబంధం లేదంటూ ఆమె బాధగా మాట్లాడుతుండటంతో.. మీకు ఒక నంబర్ ఇస్తాను.. అతడితో మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుందంటూ సూచించారు. దీంతో బాధితురాలు అతడికి ఫోన్ చేసి.. ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడేయాలని వేడుకుంది. ఒక నంబర్ పంపిస్తాను.. ఆ నంబర్కు రూ. 50 వేలు పంపించండి.. అంటూ నమ్మించి.. ఆ డబ్బు లాగేశారు. ఆ తరువాత సీబీఐ వాళ్లు ఫోర్స్ చేస్తున్నారంటూ మరో రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. ఇలా రూ. 2 లక్షలు స్వాహా చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు భర్తకు చెప్పడంతో.. ఇదంతా మోసమని, పోలీసులకు ఫిర్యాదు చేయలంటూ సూచించాడు. సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒక్క క్షణం ఆలోచించండి..!
మీకు సంబంధం లేకుండా విదేశాల నుంచి ఎవరు పార్సిల్ పంపిస్తారు. వాళ్లకు అవసరమేంటీ. ఎలాంటి సంబంధం లేకుండా వేలాది డాలర్లు, పౌండ్స్ ఎందుకు పంపిస్తారు. మీ పేరుతో డ్రగ్స్ పంపించాల్సిన అవసరం వాళ్లకు ఎందుకొచ్చింది. మీకు డ్రగ్స్ పంపిస్తే వాళ్లకు వచ్చే లాభమేంటి.. అనే విషయాలపై మీలో మీరు ప్రశ్నించుకోండి. ఇలాంటి ఫోన్కాల్స్ వస్తే వెంటనే అనుమానించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, పోలీసులకు తెలియజేయండి. బ్లాక్ మెయిలింగ్కు భయపడకండి. అత్యాశకు పోయి బోర్ల పడవద్దు.. అంటూ పోలీసులు సూచిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇలాంటి ఫోన్ కాల్స్పై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. పై రెండు ఘటనల్లో మొదటి ఘటనలో.. బాధితురాలు మరింత ముందుగా స్పందించి ఉంటే నష్టం జరిగేది కాదని, రెండో ఘటనలో ధైర్యంగా నాకు సంబంధం లేదని చెప్పినా.. ఇతరులతో చర్చించినా డబ్బు పోయేది కాదని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్తో హడలిపోకుండా, ఆ కాల్పై ఇతరులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.