సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తవ్వినకొద్దీ మాస్ కాపీయింగ్ ముఠాలు బయటపడుతున్నాయి. జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ నిర్వహించింది రెండు ముఠాలే కాదని, 20 మంది ముఠా, 20 కేంద్రాల్లో మాస్కాపీయింగ్ చేయించి పరీక్షలు రాయించినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. ఈ 20 మంది నిర్వాహకుల ద్వారా 500 మంది వరకు పరీక్షల్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకొని విదేశాలకు వెళ్లి వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వందమంది వివరాలను కూడా పోలీసులు సేకరించారు. మాస్ కాపీయింగ్తో ఎక్కువ స్కోర్ తెచ్చుకొని విదేశాల్లో చదువుతున్న వారి యూనివర్సిటీలకు, ఈటీఎస్ ద్వారా కాపీయింగ్ విషయాన్ని తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.
జీఆర్ఈ రూ.20 వేలు, టోఫెల్కు 35 వేలు..
జీఆర్ఈ (గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్), టోఫెల్ (టెస్టింగ్ ఇంగ్లిష్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షల్లో ఆన్లైన్లో మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న మండాల శ్రావణ్కుమార్, మండాల సాయిసంతోష్, పి.కిశోర్, అర్కతాల కిరణ్కుమార్ను సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈటీఎస్ (ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ నవీన్ బృందం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టింది. ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి అభ్యర్థులను ఆకర్షించుకున్నారని, అభ్యర్థుల నుంచి జీఆర్ఈ రూ.20 వేలు, టోఫెల్కు రూ. 35 వేలు వసూలు చేసి, పరీక్షలు రాయించారని పోలీసులు తెలిపారు.
కరోనా తెచ్చిన అవకాశం..
కరోనా నేపథ్యంలో జీఆర్ఈ, టోఫెల్ విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షలు ఇంట్లో నుంచి ఆన్లైన్లోనే రాసే సౌకర్యం ఉండటాన్ని ఈ ముఠాలు ఆసరాగా చేసుకున్నాయి. ఈ ముఠా నగరంలో 20 చోట్ల పరీక్షలు రాసేందుకు అడ్డాలను ఏర్పాటు చేసుకున్నది. బ్యాచ్లర్స్ గదులు, కార్యాలయాలు, అపార్టుమెంట్లలోని ఫ్లాట్లను అద్దెకు తీసుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు ఒక టేబుల్, ఇంటర్నెట్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ ల్యాప్టాప్తో వచ్చి పరీక్ష రాశారు. పరీక్ష పూర్తయ్యేంత వరకు టేబుల్ కిందనే ఒకరు ఉంటూ.. కంప్యూటర్కు ఉండే కెమెరాకు చిక్కకుండా, కంప్యూటర్ స్క్రీన్పై వచ్చే ప్రశ్న పత్రాన్ని ఫొటో తీస్తూ తమ సహచరులకు పంపించారు. జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలు రాసి బాగా స్కోర్ తెచ్చుకోవడంలో నిష్ణాతులైన వారిచే జవాబులు రాయించారు. ఆ జవాబులను పరీక్ష రాస్తున్న వారికి అందజేసి రాయించారు. కెమెరాకు చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
అడ్డదారిలో వెళ్లిన వారిలో వణుకు
హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు జీఆర్ఈ, టోఫెల్ పరీక్షల్లో మాస్కాపీయింగ్ను వెలుగులోకి తేవడంతో అడ్డదారిలో విదేశాలకు వెళ్లిన వారిలో వణుకు మొదలయ్యింది. అరెస్టయిన నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారంతోనే సుమారు 500 మంది ఈ ముఠాల ద్వారా విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం సేకరించేందుకు కోర్టు అనుమతితో నిందితులను తమ కస్టడీకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.