సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 55 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేయడంతో పాటు మరో 18మందిని వారి మాతృ జోన్ అయిన మల్టీజోన్-2కు పంపిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేష్ ఉత్తర్వులు జారీచేశారు. మూడు నెలల కిందట జరిగిన 65 మంది సీఐల బదిలీల్లో పెద్ద ఎత్తున పైరవీలు జరగడం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి ఫోకల్ స్టేషన్లను అప్పగించారంటూ సొంత శాఖలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆరోపణలు ఎదురవడంతో మే 2న జారీచేసిన బదిలీల ఆదేశాలను మరుసటి రోజే నిలిపివేసిన విషయం తెలిసిందే.
దీంతో సైబరాబాద్ కమిషనరేట్ చరిత్రలోనే తొలిసారిగా సీఐల బదిలీలు రద్దవడం జరిగింది. మూడు నెలల పాటు నిలిచిపోయాయిన బదిలీలలో మార్పులు చేర్పులు చేసి తాజాగా 55 మంది సీఐలను బదిలీచేస్తూ, కొత్త పోస్టింగ్లు కల్పించారు. మరికొందరు దీర్ఘకాలంగా కమిషనరేట్ పరిధిలో తిష్టవేసిన సీఐలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వారి మాతృజోన్కు తిప్పి పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
తాజాగా జరిగిన బదిలీలలో సైతం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కొన్ని ఠాణాలలో పోస్టింగ్ల కోసం కానిస్టేబుల్ స్థాయి నుంచి సీఐ స్థాయి వరకు కొంత మంది పెద్ద ఎత్తున పైరవీలు చేయడం, ఆమాత్యుల చుట్టూ ప్రదిక్షణలు చేయడంతో పాటు భారీగా ముడుపులు కూడా చెల్లించుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి.