సిటీబ్యూరో, మార్చి 26(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డాటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు ప్లాన్ ఆఫ్ యాక్షన్కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో డాటా సరఫరా చేస్తున్న ఎండ్ యూజర్ను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.దీంట్లో భాగంగా నిందితులను మరోసారి కోర్టు అనుమతితో సోమవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత నిందితులు డాటా చోరీ ఎలా చేశారు? ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఎంత సంపాదిస్తున్నారు…ఇప్పటి వరకు విదేశాలకు ఏమైనా డాటాను తరలించారా ? ఇలా అనేక విషయాలను రాబట్టనున్నారు. నోయిడా ముఠాతో పాటు ఈ దందాలో ఇంకా ఎన్ని ముఠాలు పని చేస్తున్నాయనే అంశాలను పోలీసులు తెలుసుకోనున్నారు. ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్ల డాటా కూడా ఏమైనా ఉందా…ఉంటే వాటిని ఎలా తీసుకువచ్చారనే రూటును పోలీసులు కనిపెట్టేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా డాటా బయటికి వచ్చిన 140 కేటగిరీల్లో కీలకంగా ఎవరు వ్యవహరించారనే కోణం లో పోలీసులు ఆరా తీస్తున్నారు. క్రైం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ సారథ్యంలో 1-ఏసీపీ, 2-ఇన్స్పెక్టర్లు, 6-సైబర్ పోలీసు కాప్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నారు. డాటా చోరీ చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులు, నగదును కూడా పోలీసులు జప్తు చేయనున్నారు. ముఖ్యంగా ఈ డాటా భద్రపర్చిన క్లౌడ్ సర్వర్లు నిర్వహిస్తున్న గూగుల్తో పాటు మరికొన్ని సంస్థలకు పోలీసులు లేఖలు రాశారు. జీబీల్లో ఉన్న డాటా వివరాలను పోలీసులు శోధించనున్నారు. దేశ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే డాటా ప్రైవసీ బిల్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.