బండ్లగూడ, నవంబర్ 17: పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. పట్టణాల్లో 2 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిషాల్లోపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో జరిగిన పోలీసు అధికారుల సమావేశంలో ఆయన వారికి పలు సూచనలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు, సమస్యలు.. జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ స్టేషన్ల వద్ద మరింత బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. రాజేంద్రనగర్ జోన్లోని ఎన్ఫోర్స్మెంట్, కేంద్ర సాయుధ బలగాల వినియోగం.. తదితర అంశాలపై కూడా చర్చించారు.
పోలింగ్ లొకేషన్లు, పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో తీసుకోవాల్సిన అన్ని చర్యలు, మార్గదర్శకాలను ఈ సందర్భంగా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. ఇందులో భాగంగానే బార్డర్ తనిఖీ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పోలింగ్ కంటే 72 గంటల ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యేకంగా తెలిపారు. ఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్, క్యూఆర్టీ బృందాలు క్లిష్టమైన ప్రాంతాలలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, చేవెళ్ల ఏసీపీ, పలువురు ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.