సిటీబ్యూరో, సెప్టెంబరు 9(నమస్తే తెలంగాణ):పోలీసు కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని (గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేస్తానని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హామీ ఇచ్చారు. గురువారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర పోలీసు కమిషనరేట్ స్పెషల్ బ్రాంచి, ట్రాఫిక్, సైబర్ క్రైమ్స్, సీసీఆర్బీ, షీ టీమ్స్ విభాగాలకు చెందిన కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనదీ పోలీసు కుటుంబమేనని, తనకు పోలీసుల సమస్యలేంటో పూర్తిగా తెలుసన్నారు. పోలీసులకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. పోలీసులు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, వారి పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని సూచించారు. ఈ సమావేశంలో మొత్తం 200 మంది సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.