సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పోలీసులకు సాయంగా నిలిచిన పలువురు ట్రాఫిక్ వలంటీర్లను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఘనంగా సన్మానించారు. గడిచిన నాలుగు నెలల్లో ఐదు అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 2013లో ప్రారంభమైన ట్రాఫిక్ వలంటరీ వ్యవస్థ అటు ప్రజలకు, ఇటు ట్రాఫిక్ పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నదన్నారు.
ఈ వ్యవస్థను మరింత విస్తరించి, బలోపేతం చేసేందుకు ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావు మాట్లాడుతూ ట్రాఫిక్ వలంటరీ అనేది మంచి అంశమని, కరోనాకు ముందు చాలా మంది సేవలు అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.