మణికొండ, జూలై 3: నార్సింగి పోలీసుల కస్టడీ నుంచి నాటకీయంగా పరారైన అంతర్రాష్ట్ర గంజాయి కేసు నిందితుడు ముజఫర్ను సైబరాబాద్ పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. నిందితుడి ఆచూకీని సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో గుర్తించి ప్రత్యేక బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం గంజాయి అక్రమ రవాణా కేసులో ముజఫర్ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్లో ఉంచారు.
ఈ క్రమంలో బాత్రూమ్కు వెళ్లిన నిందితుడు అక్కడి కిటికీ అద్దాలను పగలగొట్టి పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. దీంతో సీపీ రమేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం ఇతర రాష్ర్టాల్లోనూ విస్తృతంగా గాలింపు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం, నిఘా సమాచారాన్ని వినియోగించి అతడి కదలికలను నిరంతరం పర్యవేక్షించారు.
ఈ క్రమంలో ముజఫర్ తన భార్యతో కలిసి ఢిల్లీ వైపు పారిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. హర్యానా సరిహద్దుల్లో నిందితుడు, అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు.
ఈ సందర్భంగా సీపీ రమేశ్ మాట్లాడుతూ నిందితుడు ఎంతటి చాకచక్యంగా తప్పించుకున్నా, సాంకేతిక ఆధారాలతో అతడిని హర్యానాలో గుర్తించి అరెస్ట్ చేయగలిగామన్నారు. డ్రగ్స్ ముఠాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునేందుకు కారణమైన పరిస్థితులపై కూడా సమగ్ర అంతర్గత విచారణ నిర్వహిస్తామని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.