సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): సినీ పక్కీలో బ్యాంకు, నగల దుకాణాన్ని కొల్లగొడదామనుకున్న దోపిడీ దొంగల ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. అప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదైన ఐదుగురు కరుడుగట్టిన నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో నగరంలో భారీ దోపిడీకి చెక్ పడింది. బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర, బాలానగర్ జోన్ డీసీపీ టి.శ్రీనివాసరావు, క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్తో కలిసి వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్రలోని పుణెకు చెందిన అమర్సింగ్ జాగ్గర్ సింగ్ టక్(21), లక్కీసింగ్ గబ్బర్ సింగ్ టక్(20), నిహాల్సింగ్ మానవ్సింగ్(17), జీత్సింగ్ రాజ్పాల్ సింగ్ (26), నిశాంత్ సింగ్ (22) ముఠాగా ఏర్పడి బ్యాంకులు, నగల దుకాణాలు, రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను దోచుకోవడం వంటి నేరాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలోని బ్యాంకులు, నగల దుకాణాలను దోచుకునేందుకు ఇటీవల ఈ ముఠా నగరానికి వచ్చి షాపూర్నగర్, మెట్కాన్పల్లిలోని నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో మకాం వేసింది. వీరిలో జీత్సింగ్, నిహాల్సింగ్ సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న టాటా ఇండికా కారును దొంగిలించగా.. అమర్సింగ్, లక్కీసింగ్, నిశాంత్సింగ్లు కత్తెరలు, స్క్రూ డ్రైవర్లు, కట్టర్లు కొనుగోలు చేశారు.
బ్యాంకు, నగల దుకాణాల దోపిడీకి రెక్కీ
నిహాల్ సింగ్కు జీడిమెట్లలో బంధువులు ఉండటంతో తరచూ అతడు వచ్చిపోతుండే వాడు. ఈ క్రమంలో స్థానిక పరిస్థితులు, బ్యాంకులు, నగల దుకాణాలపై అవగాహన ఉంది. దీంతో నిందితులందరితో కలిసి జీడిమెట్ల పీఎస్ పరిధిలోని ఓ నగల దుకాణం, బ్యాంకును దోపిడీ చేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. రెండు రోజుల కిందట ఓ నగల దుకాణంలో రెక్కీ నిర్వహించారు. ఇందుకోసం గుమ్మడిదలలో దొంగిలించిన కారును సిద్ధం చేసుకున్నారు. రాత్రికి రాత్రి దోపిడీకి పాల్పడి, చోరీ చేసిన కారులో పారిపోవాలని వ్యూహం రచించారు.
రెండు గ్యాంగ్ల మధ్య వైరంతోనే నగరానికి
మహారాష్ట్రకు చెందిన ఈ ఐదుగురు ముఠా సభ్యులతో పాటు మరో ముఠాకు మధ్య కొంత కాలం నుంచి వైరం ఏర్పడినట్లు తెలిసింది. నగరానికి వచ్చిన ముఠాలోని ఓ నిందితుడి సోదరుడిని అక్కడున్న ముఠా హత్య చేయడంతో ఈ రెండు ముఠాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే వీరు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి తిష్ట వేశారు.
రూ.25వేలకో తుపాకీ కొనుగోలు
మహారాష్ట్రలోని పప్పుసింగ్ అనే నిందితుడి వద్ద నుంచి రూ.25వేలకు ఒకటి చొప్పున తుపాకులు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా దొంగతనం చేసిన తరువాత పారిపోయేందుకు వాహనాలను సైతం అదే ప్రాంతం ఉంచి తస్కరిస్తారు.
పోలీసులకు సీపీ అభినందనలు
సీపీ ఆదేశాల మేరకు బాలానగర్ జోన్ డీసీపీ టి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో బాలానగర్ ఏసీపీ ఎ.గంగారామ్, సీఐ పవన్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా నేరస్తుల కదలికలపై నిఘా పెట్టడంతో భారీ దోపిడీని అడ్డుకుని నిందితులను పట్టుకున్న బాలానగర్ జోన్ పోలీసులను ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.
గుట్టు రట్టు చేశారిలా..
బ్యాంకులు, నగల దుకాణాలను దోపిడీ చేసేందుకు దొంగల ముఠా నగరానికి వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బాలానగర్ జోన్ పోలీసులు సదరు ముఠా కదలికలపై నిఘా పెట్టారు. నగల దుకాణంలో రెక్కీ నిర్వహించిన నిందితుల కదలికలను సీసీ టీవీల్లో పరిశీలించి, ఆ దిశగా మాటు వేశారు. మంగళవారం రాత్రి దోపిడీకి సిద్ధమవుతుండగా నిందితులు ఉన్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.70వేల నగదు సహా టాటా ఇండికా కారు, మూడు దేశీయ తుపాకులు, ఆరు రౌండ్ల బుల్లెట్లు, 16 కత్తెర బ్లేడ్లు, జంబియా, 5 పొడవైన స్క్రూల్ డ్రైవర్లు, టార్చ్, కట్టర్, మంకీ క్యాప్స్, సాధారణ టోపీలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకలో 175 కేసులు
ఈ ముఠా సభ్యులు నేరాలకు పాల్పడే సమయంలో అడ్డు వచ్చిన వారిపై దాడులు చేసి గాయపరుస్తారు. అందుకోసం వారు తుపాకులను సైతం వినియోగిస్తారని, పలు మార్లు మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నట్లు కమిషనర్ వివరించారు. ఇప్పటి వరకు నిందితులపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో మొత్తం 175 కేసులు నమోదైనట్లు వివరించారు. జీత్సింగ్పై 47, అమర్సింగ్పై 18, లక్కీసింగ్పై 40, నిహాల్ సింగ్పై 40, నిశాంత్పై 30కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డ్రైమ్ యాక్ట్(ఎం-కోకా)చట్టం కూడా నిందితులపై ప్రయోగించినట్లు తెలిపారు. దీంతో ఈ ముఠా అక్కడి పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉందని, వారి కోసం మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు గాలిస్తుండటంతో వారి నుంచి తప్పించుకొని వచ్చి నగరంలో తిష్ట వేసినట్లు చెప్పారు.