సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు సిద్ధం కావాలని, గడిచిన పదేండ్లలో పోలీసు శాఖలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి శనివారం కమిషనరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇతర పోలీసు అధికారులతో కలిసి సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, అందుకు సంబంధించి ప్రభుత్వంలోని ప్రతీ శాఖకు సంబంధించిన అంశాలు ఇప్పటికే డ్రాఫ్టు రూపంలో ఇవ్వడం జరిగిందన్నారు.
కొత్త ఠాణాల ప్రారంభోత్సవం
సైబరాబాద్లో కొత్తగా ఏర్పాటైన మోకిల, కొల్లూరు, జీనోమ్ వ్యాలీ, అత్తాపూర్, అల్లాపూర్, సూరారం తదితర పోలీస్స్టేషన్లను ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభించనున్నట్లు సీపీ వివరించారు.
మొక్కలు నాటే కార్యక్రమం
దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పోలీస్శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్, తెలంగాణ మహిళా సంక్షేమ కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్, హరితోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని ప్రతి ఠాణాలో మొక్కలు నాటాలని, ఒక్కో పోలీస్స్టేషన్ పరిధిలో 1000 చొప్పున, కమిషనరేట్ పరిధిలో మొత్తం 50,000 మొకలను నాటాలని సీపీ సిబ్బందిని ఆదేశించారు. అంతేకాకుండా ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమాన్ని సైతం నిర్వహించి, అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, వారి త్యాగాలను స్మరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, బాలానగర్ డీసీపీ టి. శ్రీనివాసరావు, ఈఓడబ్ల్యూ డీసీపీ కవిత, షీటీమ్స్ డీసీపీ నితికా పంత్, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ రితీరాజ్, ఐపీఎస్, అడ్మిన్ డీసీపీ యోగేశ్ గౌతమ్, రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ రష్మీ పెరుమళ్, మాదాపూర్ ఏడీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, సీసీఎస్ ఏడీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు….
దశాబ్ది ఉత్సవాల్లో మొదటి రోజు జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర కార్యక్రమాలుంటాయని, సురక్షా దినోత్సవం రోజున పోలీసుశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతమైన సేవలను వివరించేలా కార్యక్రమాలుంటాయన్నారు. దుర్గంచెరువు వద్ద సైబరాబాద్ పోలీసులకు సంబంధించిన లేజర్ షో ఉంటుందన్నారు.
21 రోజుల పాటు..
ప్రభుత్వం నిర్దేశించిన లోగో, బ్యానర్లను అన్ని పోలీస్స్టేషన్లలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పోలీస్ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలను ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని పోలీస్స్టేషన్లు, ఏసీపీ, ఏడీసీపీ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. ఎంపిక చేసిన చోట్లల్లో డ్రిల్స్ నిర్వహించాలన్నారు.
నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పోటీలు
శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ తెలిపారు. పాటల రచన, పద్య రచన, షార్ట్ వీడియో మేకింగ్, పోస్టర్ మేకింగ్ తదితర పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా విభాగాల వారీగా విజేతలకు రూ.2వేల నుంచి రూ.70వేల వరకు నగదు బహుమతులు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 96523 94751 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.