Cyberabad | హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుతం కేసులు పెరిగాయన్నారు. వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడారు.
గతేడాది 4,850 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 5,342 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 232 కోట్ల నగదు మోసం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది 277 డ్రగ్స్ కేసుల్లో 567 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది రెండు పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేశామన్నారు. రూ. 27.82 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని తెలిపారు.
సైబరాబాద్ పరిధిలో ఆర్థిక, స్థిరాస్తి నేరాలు కూడా పెరిగాయని సీపీ తెలిపారు. మహిళలపై నేరాలు తగ్గాయని స్పష్టం చేశారు. గతేడాది 2,489 కేసులు రాగా, ప్రస్తుతం 2,356 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. అత్యాచారం కేసులు కూడా తగ్గాయి. మోసాలకు సంబంధించి 2022లో 6,276 కేసులు రాగా, ఈ ఏడాది 6,777 కేసులు వచ్చాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయన్నారు. హత్య కేసులు 2022లో 93 నమోదు కాగా, ప్రస్తుతం 105 కేసులు వచ్చాయన్నారు. ఈ ఏడాది 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. త్వరలో ఈ కేసు వివరాలను అందిస్తామని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్య కుట్ర కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు.
సిఫారసు లేఖలపై పోస్టింగ్లు ఉండబోవు అని సీపీ తేల్చిచెప్పారు. ప్రతి అధికారిపై పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.
నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సీపీ సూచించారు. అనుమతి లేకుండా న్యూఇయర్ వేడుకలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల సమయంలో తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అవినాష్ మహంతి స్పష్టం చేశారు.