జీడిమెట్ల, ఫిబ్రవరి 14: వ్యభిచారం కేసులో ఏడేండ్ల జైలు శిక్ష అనుభవించినా.. ఓ నేరస్తుడి బుద్ధి మారలేదు. 20 దొంగతనాలకు పాల్పడి ఎట్టకేలకు జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, 15 లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మంగళవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ టి.శ్రీనివాస్ రావు వివరాలను వెల్లడించారు. జనవరి 31న చింతల్ శివనగర్లోని మనోహర్ ఇంట్లో దొంగలు పడి.. ఎనిమిది తులాల బంగారంతోపాటు రూ.15 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ ఏసీపీ గంగారం ఆధ్వర్యంలో జీడిమెట్ల ఇన్స్పెక్టర్ ఎం.పవన్, డీఐ రామకృష్ణ రెండు బృందాలుగా ఏర్పడి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చింతల్లో జరిగిన దొంగతనం ఆధారంగా జీడిమెట్ల పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలతోపాటు వేలి ముద్రలను పరిశీలించారు. నిఘాను ఏర్పాటు చేసి కర్ణాటకకు చెందిన కమ్మాసింగ్ అలియాస్ కరణ్సింగ్ అలియాస్ ధరణ్ సింగ్ అలియాస్ ఆనంద్ సింగ్ (34) సూరారం కాలనీలోని ఓం జెండా వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా.. జీడిమెట్ల పీఎస్ పరిధిలో 4, జగద్గిరిగుట్టలో 2, చిలకలగూడలో 4, తుకారాంగేటులో 3, మల్కాజిగిరిలో 4, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3.. మొత్తం 20 దొంగతనాలు బయటపడ్డాయి.
నిందితుడు కమ్మాసింగ్ నుంచి పోలీసులు మొత్తం రూ.30 లక్షల విలువ చేసే 316 గ్రాముల బంగారం, 1.26 కిలోల వెండి, రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన జీడిమెట్ల ఇన్స్పెక్టర్ ఎం.పవన్, డీఐ రామకృష్ణ, ఎస్ఐ ఆంజనేయులుతోపాటు పోలీస్ సిబ్బందిని డీసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు. ఈ సమావేశంలో బాలానగర్ ఏసీపీ గంగారం, తదితరులు పాల్గొన్నారు.